నాలుగేళ్ల నుంచి మునుగోడు కు ఏంచేసావు.. రాజగోపాల్ ? – మంత్రి హరీష్

నాలుగేళ్ల నుంచి మునుగోడు లో ఏంచేసావు అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తూ..ఇతర పార్టీల నేతలపై విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యముగా బిజెపి – టిఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా తగ్గిదేలే అన్నట్లు ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు..మాజీ ఎమ్మెల్యే , బిజెపి అభ్యర్థి రాజగోపాల్ ఫై నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల నుంచి మునుగోడు లో ఏంచేసావు అంటూ ప్రశ్నించారు. బుధవారం ఉదయం మర్రిగూడెం మండలం రాజుపేట గ్రామస్తులతో మంత్రి హరీశ్‌ సమావేశమయ్యారు. వారితో కలిసి టిఫిన్‌ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏ లాభమని, టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేదేంలేదన్నారు.

తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలన్న గిరిజన సోదరుల డిమాండ్‌ను నాడు అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు పట్టించుకోలేదని చెప్పారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని అన్నారు. దీంతో మొత్తం 3,146 మంది సర్పంచులు అయ్యారని గుర్తు చేశారు.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఒక్కసారైనా గ్రామానికి వచ్చారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కనపడని మనిషి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకంటారా లేక అభివృద్ధి చేసే టీఆర్ఎస్‌ని గెలిపిస్తారా అని అడిగారు.