వారాహి అమ్మవారి నవరాత్రులు.. పవన్ కల్యాణ్ ఉపవాస దీక్ష
నిన్నటి నుంచి ఉపవాసం… కార్తీకమాసం చివరి వరకు కొనసాగింపు
అమరావతిః జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఉపవాస దీక్ష ఆచరిస్తున్నారు. నిన్న (జూన్ 19) వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. అయితే, నవరాత్రులు చివరి మూడు రోజులు ఉపవాస దీక్ష చేపట్టాలని పవన్ తొలుత భావించారు.
అయితే, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. మంగళవారం నుంచే దీక్ష మొదలుపెట్టారు. అంతేకాదు, ఈ దీక్షను కార్తీక మాసం చివరి వరకు కొనసాగించనున్నారు. అదే సమయంలో, గురుపౌర్ణమి నాటి నుంచి చాతుర్మాస దీక్షను కూడా ఎప్పటిలాగానే ఆచరించనున్నారు.
ఉపవాస దీక్ష సమయంలో పవన్ కల్యాణ్ పాలు, పండ్లు మాత్రమే తీసుకోనున్నారు. ఇటీవల వారాహి యాత్ర ప్రారంభానికి ముందు పవన్ కల్యాణ్ మంగళగిరిలో ధర్మయాగం నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన శాకాహారానికి మాత్రమే పరిమితం అయ్యారు.