ఎంపీ ల్యాడ్స్ దుర్వినియోగంపై నిజానిజాలు తేల్చాలిః జోగు రామన్న

ఇంటి నిర్మాణం కోసం, కొడుకు పెళ్లి కోసం నిధులు వాడుకున్నారంటూ ఆరోపణ

brs-mla-jogu-ramanna-responds-on-bjp-mp-soyam-bapurao-comments

హైదరాబాద్‌ః ఎంపీ ల్యాడ్స్ దుర్వినియోగంపై నిజానిజాలు తేల్చాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకోవడానికి, కొడుకు పెళ్లి చేయడానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకున్నానని ఎంపీ సోయం బాపూరావు చెప్పారని గుర్తుచేశారు. విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం మాటమార్చారని జోగు రామన్న ఆరోపించారు. ఈ విషయంలో బిజెపి అధిష్ఠానం కలగజేసుకుని, నిజాల నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని అన్నారు.

సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేశారంటూ ఎంపీ సోయం బాపూరావు వాపోవడంపై జోగు రామన్న స్పందించారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ బిజెపి నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడతారని విమర్శించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంతానికి వాడుకున్నట్లు ఒప్పుకున్న సోయం బాపూరావు ఇప్పుడు మాటమార్చి సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ కుట్రలు, నిధుల దుర్వినియోగం ఏమిటో బిజెపి ఢిల్లీ పెద్దలే తేల్చాలని డిమాండ్ చేశారు. నిజంగానే ఎంపీ ల్యాడ్స్ నిధులను సొంతానికి వాడుకుంటే సోయం బాపూరావుపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.