కోనసీమలో క్రాప్ హాలిడేపై పవన్ స్పందన

కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైస్సార్సీపీదేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి అని పేర్కొన్నారు. కోనసీమ రైతులకు అండగా జనసేన ఉంటుందని హామీ ఇచ్చారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరు. కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరు.. ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదనే నిర్ణయం తీసుకుంది అన్నారు. దాదాపు 11 ఏళ్లు తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు రావడం చాలా బాధాకరంగా ఉందన్నారు.

తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారన్నారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంట విరామ నిర్ణయాన్ని తీసుకున్నారని.. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైన ఉంటాయని వెల్లడించారు. అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని.. క్రాప్ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుందని పేర్కొన్నారు. తనకు తెలిసి 2011లో ఒకసారి ఇలా జరిగిందని.. దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట విరామం ప్రకటించారన్నారు.

ఆనాడు గోదావరి జిల్లాల రైతుల నిర్ణయం దేశాన్ని కుదిపేసిందన్నారు జనసేనాని. దాదాపు 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు తరలివచ్చి రైతాంగం సమస్యలు తెలుసుకున్నారని.. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడని కొన్ని మార్గనిర్దేశకాలు చేశారన్నారు. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితే వచ్చిందని.. అల్లవరం, ఐ. పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 25 వేల ఎకరాలు, అలాగే అమలాపురం రూరల్, మామిడికుదురు, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో 20 వేల ఎకరాలు, కడియం మండలంలో కూడా కొన్ని వందల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారని వివరించారు.