జగన్ నువ్వు ఇంతవరకు రాజకీయ నాయకులతో పోరాడావు.. విప్లవకారుడితో పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తా – పవన్ మాస్ వార్నింగ్

వారాహి యాత్రలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం లోని స్థానిక ఎస్.వి.ఆర్ సర్కిల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ..సీఎం జగన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ నువ్వు ఇంతవరకు రాజకీయ నాయకులతో పోరాడావు. విప్లవకారుడితో పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ సినిమా డైలాగ్ పేల్చారు. సొంత చెల్లిని, తల్లిని బయటకు పంపేసిన వాడు.. అలాంటి వాడికి బయటవారి మీద ఎలా ప్రేమ , బాధ్యత ఉంటుందని చెప్పుకొచ్చారు.

అలాగే వాలంటీర్ల విషయంలో కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసారు. నీ వాలంటీర్లకు అధిపతి ఎవరు? కొంతమంది వాలంటీర్లు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. తిరుపతిలో వాలంటీర్లు ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టబడ్డారు. రౌడీయిజం చేస్తున్నారు. అత్యాచారాలు కూడా చేస్తున్నారు. వాలంటీర్లు రెక్కీ చేస్తున్నారు. ఆడపిల్లలను టార్గెట్ చేస్తున్నారు. లొంగకపోతే పధకాలు ఇవ్వమని బెదిరిస్తున్నారు. గద్ద కాళ్లకింద కోడిపిల్లల్లా అయిపోయారు. పరువు పోతుందని తల్లిదండ్రులు బయటకు చెప్పుకోవడం లేదు. అలాంటి వారు పోలీసుస్టేషన్లకు వెళ్లండి. మీకు జనసేన అండగా ఉంటుంది. నేరం చేసిన వాడికి భయం లేదు. ఎందుకంటే మా జగనన్న నేరం చేసి జైలుకు వెళ్లి వచ్చి సీఎం అయ్యాడని వారు అంటున్నారు. జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద పనిచేసే కూలీ కన్నా వాలంటీర్లకు వచ్చేది తక్కువ. వీరి జీతం బూంభూంకు ఎక్కువ ఆంధ్రా గోల్డ్ కు తక్కువ. ఒక మహిళా వాలంటీర్ నాకు ఫిర్యాదు చేసినందుకు ఆమె అన్నను చంపేసి శవాన్ని ఇంటికి పంపించారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజల డేటా బయటకు పోతే, డేటా చోరీ అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? నీవు బాధ్యత వహిస్తావా? నీ మంత్రులు బాధ్యత వహిస్తావా? కేవలం ఐదువేల రూపాయల జీతంతో శ్రమదోపిడీ చేస్తున్నావు అంటూ మండిపడ్డారు.

ఇక స్పీచ్ చివర్లో ధర్మం మన వైపే ఉంది. 2024లో మన ప్రభుత్వమే వస్తుంది. అభివృద్ది జరగాలంటే, ఆరాచకం ఆగాలంటే జగన్ ప్రభుత్వం పోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.