రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్..పూర్తి షెడ్యూల్ ఇదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (మంగళవారం ) కొండగట్టుకు వెళ్లబోతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం వారాహి పేరుతో వాహనాన్ని సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వాహనానికి సంబదించిన పూజా కార్యక్రమాలు రేపు కొండగట్టులో జరపబోతున్నారు. ఇందుకు గాను రేపు పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయం తో పాటు ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ని దర్శించుకోనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను జనసేన పార్టీ అధిష్టానం విడుదల చేసింది.

మంగళవారం ఉదయం 7 గంటలకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు అంజన్న దర్శనం చేసుకుని, ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు నాచుపల్లి శివార్లలోని బృందావన్ రిసార్టులో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపైన వారితో చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ను మొదలుపెడతారు. సాయంత్రం 5:30 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.