స్వామినాథన్ కృషిని దేశ రైతాంగం, వ్యవసాయ రంగ నిపుణులు ఎప్పటికీ మరిచిపోరుః పవన్ కల్యాణ్
స్వామినాథన్ ఆత్మకు శాంతిచేకూరాలని పరమేశ్వరున్ని ప్రార్థిస్తున్నానన్న జనసేనాని
అమరావతిః భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. మన దేశంలో హరిత విప్లవానికి ఆద్యుడైన స్వామినాథన్ తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నానని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరున్ని ప్రార్థిస్తున్నానన్నారు. పెరుగుతున్న మన దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాలను సమకూర్చేందుకు అవసరమైన వంగడాలను తీసుకురావడంలో స్వామినాథన్ కృషి దేశ రైతాంగం, వ్యవసాయ రంగ నిపుణులు ఎన్నటికీ మరిచిపోరన్నారు.
అధిగ దిగుబడిని ఇచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పన చేయడం వల్ల ఆ దిశగా ఎన్నో ప్రయోగానాలు నేటికీ మన దేశంలో సాగుతున్నాయన్నారు. తన పేరిట ఉన్న రీసెర్ట్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో పరిశోధనలు చేయడంతో పాటు వాతావరణ మార్పులపై అధ్యయనాలు చేయడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మడ అడవులను సంరక్షించడంలో స్వామినాథన్ కృషి ఎంతో ఉందన్నారు. ఆయన మరణం భారత వ్యవసాయ రంగానికి తీరని లోటు అన్నారు. స్వామినాథన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.