స్టార్ హీరోల ఫ్యాన్స్ మద్దతు కోరిన పవన్ ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి విజయ యాత్ర పేరుతో యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఈ యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ప్రతి చోట పవన్ కళ్యాణ్ కు జనసేన శ్రేణులు , అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. కాగా ఆదివారం కాకినాడ లో సభ ఏర్పాటు చేసిన పవన్ …వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతూ..స్టార్ హీరోల అభిమానుల మద్దతు కోరారు.

“ఇతర హీరోల అభిమానులు కూడా నాకు అండగా నిలవాలి. మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్, రవితేజలను నేను కూడా అభిమానిస్తాను. చిత్ర పరిశ్రమ అంటే నేనొక్కడినే కాదు… మేం అందరం కలిస్తేనే చిత్ర పరిశ్రమ. మహా అయితే నేను ఏడాదికి ఒకట్రెండు సినిమాలు చేస్తానేమో. సినిమాలు వేరు , రాజకీయాలు వేరు. ఈరోజు హీరోలందరి అభిమానులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి జనసేనకు మద్దతు ఇవ్వండి. భవిష్యత్తు కోసం ముందడుగు వెయ్యండి” అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

అలాగే ఎమ్మెల్యే ద్వారంపూడి ఫై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ద్వారంపూడి అక్రమాలు, అవినీతిని చూస్తూ ఉరుకునేది లేదన్నారు. ‘జనసేన వారాహి పోస్టర్లు అతికిస్తుంటే నెంబర్ల ప్లేట్ లేని బైకు మీద వచ్చిన దుండగులు వాళ్లను బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వద్ద 50 వరకు గూండాలు ఉన్నారు. మీ అందరూ పద్ధతి మార్చుకోవాలి. నాకు అవకాశం, అధికారం వచ్చిన తరువాత ఈ గూండాలని ప్రతి ఒక్కరిని వీధి విధి తన్ని తన్ని తీసుకెళ్తాను. ద్వారంపూడి నువ్వు ఆడబిడ్డల జోలికి వచ్చినా, మీ గూండాలు ఆడవాళ్లను బెదిరించినా.. మీ తాతను టీటీ నాయక్ తీసుకెళ్లినట్లే, ఎమ్మెల్యే ద్వారంపూడిని బేడీలు వేసి తీసుకెళ్తామన్నారు. మీ తాతకు టీటీ నాయక్ చేసినట్లు.. నీకు భీమ్లానాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తానంటూ ఎమ్మెల్యే ద్వారంపూడిని హెచ్చరించారు.