కృష్ణతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పరుచూరి

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు అనేది ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు. మరికాసేపట్లో ఆయన అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. నిన్న నానక్ రామగూడ లో ఆయనను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో సినీ , రాజకీయ ప్రముఖులు హాజరు కాగా, ఈరోజు పద్మాలయ స్టూడియో లో అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు , రాజకీయ నేతలు హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్ , గవర్నర్ తమిళసై, జయప్రద మొదలగు ప్రముఖులు నివాళ్లు అర్పించారు.

తాజాగా ‘పరుచూరి పలుకులు’ ద్వారా కృష్ణతో తమకి గల అనుబంధాన్ని గురించి పరుచూసి గోపాలకృష్ణ ప్రస్తావించారు. “దర్శకుడు పీసీ రెడ్డి గారి ద్వారా మాకు కృష్ణగారితో పరిచయమైంది. ‘బంగారు భూమి’ సినిమాకి మోదుకూరి జాన్సన్ రచయితగా ఉన్నారు. ఆయన అందుబాటులో లేని కారణంగా మేము కొని సీన్స్ రాశాము” అన్నారు.

ఆ సినిమాలోని ఒక సీన్ లో ‘పద్మా .. మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు .. మట్టిని నమ్మితే మన నోట్లో ఇంత ముద్ద పెడుతుంది .. ఆ మట్టికి నమస్కారం చేయి’ అనే డైలాగ్ రాశాము. ఆ డైలాగ్ చెప్పిన కృష్ణగారు, అది ఎవరు రాశారని అడిగారట. ఆ డైలాగ్ రాసింది మేమని తెలిసి వరుస సినిమాలు ఇస్తూ వెళ్లారు. తన ప్రతి సినిమాకి రాయమని ముందుగా మా దగ్గరికే ఆయన పంపించేవారు. ఆయన హీరోగా చేసిన 54 సినిమాలకి మేము పనిచేశాము. మాతో ఎక్కువ సినిమాలకి రాయించిన హీరో ఆయన” అని చెప్పారు.

” కృష్ణగారి మనసు బంగారం .. ఇండస్ట్రీలో ఆయన సాయం పొందని వారు అతి తక్కువమంది అనే చెప్పాలి. నేను సొంత ఇల్లు కట్టడం మొదలు పెట్టిన తరువాత డబ్బులు సరిపోక ఆగిపోయినప్పుడు, ఆ విషయం తెలిసి డబ్బు పంపిన విశాలమైన హృదయం ఆయన సొంతం. ఇలా ఎంతమందికి కృష్ణగారు సాయం చేశారన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఎన్ని సినిమాలతో మేము బిజీగా ఉన్నప్పటికీ కృష్ణగారు పంపించారంటే కాదనేవాళ్లం కాదు. అది ఆయన పట్ల మాకు గల అభిమానం .. గౌరవం” అంటూ చెప్పుకొచ్చారు.