జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం: ఏపీ కి 17 అవార్డులు
ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవార్డుల ప్రదానం
Amaravati: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జాతీయ అవార్డుల ప్రదానోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పంచాయతీ రాజ్ శాఖలో ఆంధ్రప్రదేశ్కు నాలుగు కేటగిరీల్లో మొత్తం 17 అవార్డులు లభించాయి.
ఇ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డుతో పాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈ ఏడాది (2021) రాష్ట్రానికి దక్కాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు.
ఇ–పంచాయత్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ పొందిన రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్కు ప్రదానం చేశారు.
జిల్లా స్థాయిలో గుంటూరు జిల్లా పొందిన అవార్డు (దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారం)ను జడ్పీ సీఇఓ డి.చైతన్యకు, కృష్ణా జిల్లా పొందిన అవార్డును జడ్పీ సీrఓ పీఎస్ సూర్యప్రకాశరావుకు సీఎం జగన్ అందజేశారు.
మండల స్థాయిలో చిత్తూరు జిల్లా సొడెం, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీలకు దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాలు అందజేశారు.
పంచాయతీల స్థాయిలో కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖపట్నం జిల్లా పెదలబూడు, గుంటూరు జిల్లా గుల్లపల్లి, నెల్లూరు జిల్లా తడ కండ్రిగ, అదే జిల్లాకు చెందిన తాళ్లపాలెం, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పు గోదావరి జిల్లా జి.రంగంపేట పంచాయతీలకు సీఎం వైయస్ జగన్ పురస్కారాలు అందజేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/