తోషాఖానా బహుమతులను వేలం వేయనున్న పాక్ ప్రధాని షెహబాజ్
ఇస్లామాబాద్ః పాకిస్థాన్ సర్కార్ ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. తోషాఖానా కానుకల ద్వారా వచ్చిన డబ్బును పేదలు, నిస్సహాయకుల కోసం వినియోగిస్తామని వెల్లడించారు. పాక్ మీడియా నివేదిక ప్రకారం.. ‘తోషాఖానాలోని మిలియన్ల విలువైన బహుమతులను వేలం వేయాలని నిర్ణయించాను. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అనాథ పిల్లల సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాల కోసం వినియోగిస్తాం. వాటికి తప్ప ఆ నిధులు మరెక్కడికీ వెళ్లవు’ అని షెహబాజ్ వెల్లడించారు. మరోవైపు తోషాఖానా బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ బహుమతులను వేలం వేయాలని షెహబాజ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కాగా, ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు చేయనున్నట్లు షెహబాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందే దాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని ఈనెల 9న (నేడే) సిఫార్సు చేస్తానని షెహజాబ్ ఇటీవలే వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు పాక్ పీఎం పదవికి షెహబాజ్ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.