మళ్లీ కన్నీరు పెట్టించబోతున్న ఉల్లి ధర..
ఉల్లి ధర మళ్లీ కన్నీరు పెట్టించబోతుందా అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. గతంలో ఉల్లి ధర దాదాపు కేజీ వంద వరకు వెళ్లి సామాన్యులకు కన్నీరు పెట్టించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు ఆ ధర అలాగే నడిచింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో రూ.20 నుంచి 30 వరకు పలుకుతోంది. అయితే రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉందని అంటున్నారు. ఉల్లి ని ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఎక్కువగా పండిస్తుంటారు. తౌటౌ తుఫాను ఎఫెక్ట్తో మహారాష్ట్ర, కర్ణాటకలలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైంది.
దేశ వ్యాప్తంగా ఉల్లికి ఉన్న డిమాండ్ లో ప్రధానంగా 75 శాతం పంట ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. ఈ సీజన్కి సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. పంట చేతికి రావడం.. ప్రాసెసింగ్.. సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్కి రావడానికి పట్టే సమయం సాధారణం కంటే అధిక సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ కారణంగా ఉల్లి ధరలు మళ్లీ పెరగబోతాయని చెపుతున్నారు.