బంగాళాఖాతంలో అల్పపీడనం : మళ్లీ వర్షాలే వర్షాలు..

గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల నుండి ప్రజల బయటపడ్డారో లేదో..మరో అల్పపీడనం మొదలైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నాల్గు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. రెండు రోజులుగా వర్షాలు పడకపోయేసరికి హమ్మయ్య అనుకున్నారు. కానీ ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిక తో భయపడుతున్నారు. మొన్నటి వానలకే రోడ్లు నదులు తలపించాయని , వందల ఎకరాలు నీటిలో మునిగిపోయాయని , ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని చెపుతున్నారు. మరి ఇప్పుడు రానున్న వర్షాలు ఎలాంటి నష్టాలు తెస్తాయో అని ఖంగారుపడుతున్నారు.