కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ఒమిక్రాన్‌ పై చర్చ

హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతిభవన్‌లో సీఎం కెసిఆర్ అధ్యక్షతన కొనసాగుతున్నది. సమావేశం ప్రారంభమైన అనంతరం రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించిన హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్‌ సమీక్షించింది.
ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. మరిన్ని ఎక్కువగా కరోనా పరీక్షలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్ల సన్నద్ధతపై కేబినెట్‌లో చర్చించారు. ఈ సందర్భంలో కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి నేపథ్యంలో దానిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిని తెలిపి, నివేదిక సమర్పించారు. గత రెండేళ్లుగా కరోనా కట్టడికి జరిగిన పురోగతిపై మంత్రివర్గం చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, తామంతా సంసిద్ధంగా ఉన్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు.

రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లోని పరిస్థితులను సమీక్షించి, అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకొని.. ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జిల్లాల వారీగా టీకా ప్రక్రియను సమీక్షించి, అదిలాబాద్, కుమ్రుంభీం, నిర్మల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/