జగన్ సర్కార్ కు భారీ షాక్ ఇచ్చిన ఎల్ఐసీ ..

ఏపీ సర్కార్ కు ఎల్ఐసీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పథకం అభయహస్తంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఈ పథకం కింద తమ వద్ద ఉన్న రూ.2,000 కోట్ల నిధిని (ప్రీమియం కింద లబ్ధిదారులు చెల్లించిన సొమ్ము) ప్రభుత్వం విత్‌డ్రా చేయడంతో మా ఒప్పందం రద్దయ్యిందని ఆ ప్రకటనలో పేర్కొంది. అభయహస్తం పథకం కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థతో 27 అక్టోబరు 2009లో ఎల్ఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ఒప్పందం 3 నవంబరు 2021న రద్దయినట్టు ఎల్ఐసీ తన ప్రకటనలో తెలిపింది.

2009 నవంబర్ లో అభయహస్తం పథకం కోసం గ్రామీణ పేదరిక సంస్థతో ఎల్ఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారు అభయహస్తం పథకంలో వారి వాటా చెల్లించడం ద్వారా 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. వైయస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎం అయిన తర్వాత 2009లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 365 చెల్లిస్తే అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చెల్లించిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెల రూ. 500 నుంచి రూ. 3 వేల వరకు పెన్షన్ అందించాలనేదే ఈ పథకం ఉద్దేశం.

కాగా ‘అవగాహన ఒప్పందం రద్దుకావడంతో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న నిధులను అభయహస్తం పథకం నోడల్ ఏజెన్సీ ఎస్ఈఆర్సీకి బదిలీ చేశాం..మాస్టర్ పాలసీ నెంబరు 514888, అభయహస్తం పథకం కింద మా అన్ని కర్తవ్యాలు, బాధ్యతలు నుంచి వైదొలగాం.. ఇకపై అభయహస్తం పథకంతో ఎల్ఐసీకి ఎటువంటి సంబంధం లేదు.. ఇకపై లబ్దిదారుల గత క్లైయిమ్‌లు, పెండింగ్‌లో ఉన్న క్లైయిమ్‌లు, భవిష్యత్తులో క్లైయిమ్‌లన్నింటినీ పరిష్కరించే బాధ్యత గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థదే’ అంటూ బహిరంగ ప్రకటనలో వెల్లడించింది.