లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం

లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రి సందర్శనకు వైఎస్ షర్మిల బయలు దేరగా పోలీసులు ఆమెను అడ్డుకొని ఇంట్లో నుండి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో షర్మిల..పోలీసులతో వాగ్వాదం చేసింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని , మీ వాహనంలో తీసుకెళ్లినా పర్వాలేదని షర్మిల వేడుకున్నారు. తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరమర్శిస్తానని షర్మిల స్పష్టం చేశారు. వెళ్ళనివ్వద్దని పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్డులో వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. రూ.200కోట్లు పెట్టి ఉస్మానియా హెల్త్ టవర్స్ కడతామని సీఎం కేసీఆర్ గాలి మాటలు చెప్పారని విమర్శించారు. తనను హౌజ్ అరెస్టు చేయడంపైనా ఆమె నిప్పులు చెరిగారు. మీకు ఏం అధికారం ఉందని హౌజ్ అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఅర్ నియంత అని మరో సారి నిరూపణ అయ్యిందని, వైఎస్సార్ బిడ్డకు కేసీఅర్ భయపడుతున్నాడని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనతా రైడ్ కి పిలుపు నిచ్చామన్న షర్మిల.. ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని అనుకున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ర్టంలో ప్రజాస్వామ్యం లేదు.. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదన్నారు.ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్ లు చేస్తున్నా రు… మీరు రాష్ట్రం లో జరుగుతున్న దానిపై దృష్టి పెట్టండని మోడీని కోరారు.