సాదాసీదాగా నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ , పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాంగ్మయి పెళ్లి వేడుక సాదాసీదాగా జరిగింది. బెంగళూరులోని తమ నివాసంలోనే జరిగిన ఈ వివాహానికి అతికొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

కేంద్ర మంత్రి అయినప్పటికీ- రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకూ పెళ్లి పిలుపు లేదు. ఉడుపి మఠాధిపతి ఈ వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. తమిళ బ్రాహ్మణ సంప్రదాయపద్ధతుల్లో వివాహ ప్రక్రియ కొనసాగింది. ఇక, ఈ వివాహం గురించి సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించకున్నా.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల గారాలపట్టి వాంగ్మాయి.

వాంగ్మయి వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న ఓ జాతీయ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తోన్నారు. ప్రత్యేకించి- ఆర్ట్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, సాహిత్యం మీద వార్తలను రాస్తుంటారు.