యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ
హైదరాబాద్ః ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ ఇండియా కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తుండటంపై ఎన్సీపీసీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు యూట్యూబ్ ఇండియాకు సమన్లు అందజేసింది. జనవరి 15న ఆయా ఛానళ్ల జాబితాతో యూట్యూబ్ ఇండియా ప్రతినిధి తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇలాంటి వీడియోలు చిన్నారుల భద్రత, శ్రేయస్సుకు హాని కలిగించే ప్రమాదం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు అసభ్యకర కంటెంట్ను తమ మాధ్యమం నుంచి తొలగించేందుకు ఎలాంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని కోరింది.