మోడీ సర్కారుపై ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ప్రశంసల జల్లు

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్న నవీన్ పట్నాయక్

Naveen Patnaik praises PM Modi, rates his government ‘8 out of 10’

న్యూఢిల్లీః కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసల జల్లు కురిపించారు. విదేశాంగ విధానం అత్యుత్తమంగా ఉందని ఆయన కేంద్రానికి కితాబునిచ్చారు. దేశంలో అవినీతి నిర్మూలనకు మోడీ సర్కారు తీసుకుంటున్న చర్యలను పట్నాయక్ కొనియాడారు. మొత్తంగా మోడీ ప్రభుత్వానికి నవీన్ పట్నాయక్ పదికి 8 మార్కులు వేశారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని పేర్కొన్న పట్నాయక్.. కేంద్రంతో ఒడిశాకు సత్సంబంధాలు ఉన్నాయని వివరించారు.

ఇటీవల పార్లమెంట్ పాస్ చేసిన మహిళా బిల్లుపై ఒడిశా సీఎం స్పందిస్తూ.. మహిళా బిల్లు నిస్సందేహంగా గొప్ప ముందడుగు అని చెప్పారు. మహిళల అభివృద్ధి గురించి ఆలోచించడంలో, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఒడిశా ముందు ఉంటుందని వివరించారు. తన తండ్రి హయాంలోనే మహిళా రిజర్వేషన్లు అనధికారికంగా అమలు చేశారని పట్నాయక్ గుర్తుచేశారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించగా.. తమ ప్రభుత్వం దానిని 50 శాతానికి పెంచిందని వివరించారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన మిషన్ శక్తి పథకాన్ని పట్నాయక్ ప్రశంసించారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలను కూడా తమ సర్కారు స్వాగతిస్తోందని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.