మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణం
మేఘాలయః ఈశాన్యం రాష్ట్రం మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫఘు చౌహాన్ సంగ్మా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కన్రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు.
మేఘాలయలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన నేషనల్ పీపుల్స్ పార్టీ, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ , బిజెపి , హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ఇండిపెండెంట్లతో కలిసి ఎన్పీపీ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్ 2.0’ గా నామకరణం చేశారు. మొత్తం 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో కూటమి సభ్యుల బలం 45గా ఉంది.
మేఘాలయలో మొత్తం 60స్థానాలుకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎన్పీపీ 26 స్థానాలను గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 5 సీట్లతో గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్కు 5 సీట్లు వచ్చాయి. అటు బిజెపి, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి నాలుగు సీట్లు దక్కాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.