మెహబూబా ముఫ్తీకి తృటిలో తప్పిన ప్రమాదం
న్యూఢిల్లీః జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తూ పీడీపీ అధినేత్రి ముఫ్తీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు ముఫ్తీ గురువారం ఖానాబాల్కు కారులో బయల్దేరారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ అనంత్నాగ్ వద్దకు రాగానే ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రమాద సమయంలో కారులో ముఫ్తీతోపాటు ఆమె భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో పీడీపీ అధినేత్రి కారు ముందుభాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.