లోకేశ్ పాదయాత్రకు రెండు రోజులు విరామం
మంగళగిరి కోర్టుకు రానున్న యువనేత
అమరావతిః తన పైనా, తన కుటుంబంపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టిడిపి యువనేత నారా లోకేశ్ న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. తప్పుడు వార్తలు రాస్తూ, తనని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందంటూ సాక్షిపై గతంలో ఆయన పరువునష్టం దావా వేశారు.
తాజాగా వైఎస్ఆర్సిపి నేతలు, సోషల్ మీడియా బాధ్యులు కూడా తనని టార్గెట్ చేస్తున్నారంటూ క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ పోతుల సునీతలపై మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఈ కేసులో పిటిషనర్ అయిన నారా లోకేశ్ వాంగ్మూలాన్ని మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ కోర్టులో 14వ తేదీ శుక్రవారం నమోదు చేయనున్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ 12న పాదయాత్ర ముగించుకొని బయలుదేరి అమరావతి రానున్నారు. కోర్టు పనిమీద వస్తుండడంతో యువగళం పాదయాత్రకి 13, 14వ తేదీలలో విరామం ప్రకటించారు.