విదేశీ పర్యటనకు వెళ్లిన శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం ..

విదేశీ పర్యటనకు వెళ్లిన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించారు.కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన ఎమ్మెల్యే రమేశ్ లట్కే బుధవారం గుండెపోటుతో మరణించారని శివసేన ఆఫీస్ బేరర్ తెలిపారు. ముంబయిలోని అంధేరి ఈస్ట్ నియోజకవర్గం నుంచి రమేశ్ లట్కే రెండుసార్లు శివసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

2014లో కాంగ్రెస్​ అభ్యర్థి సురేశ్​ షెట్టిని ఓడించి.. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు లట్కే. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం. పటేల్​పై ఘనవిజయం సాధించారు. అంతకుముందు బృహన్​ ముంబయి మునిసిపల్​ కార్పొరేషన్​కు(బీఎంసీ) కార్పొరేటర్​గా కూడా పనిచేశారు. ఎమ్మెల్యే మృతి వార్త తెలిసి పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. రమేశ్ లట్కే మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇటీవల కొంకణలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా విమానంలో కలిశారని బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే అన్నారు.