ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రహ్మణి
చంద్రబాబు మంచిచెడ్డల గురించి తెలుసుకున్న వైనం
అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. గత 21 రోజులుగా ఆయన జైల్లోనే గడుపుతున్నారు. మరోవైపు చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, జైల్లో అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి వీరిద్దరూ రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఆయన కోసం జైలుకు భోజనం పంపిస్తున్నారు. మరోవైపు తమను కలిసేందుకు వస్తున్న టిడిపి నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా టిడిపి శ్రేణులు కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్షలకు వెళ్లి వారితో మమేకమవుతున్నారు.