పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన మహా నేత ఎన్టీఆర్ – బాలకృష్ణ

టీడీపీ పార్టీ నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకొని , 41 వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్బంగా ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు చంద్రబాబు , బాలకృష్ణ లతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల టీడీపీ నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే , సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను వేనోళ్ల కీర్తించారు. ఇప్పటికీ పాతతరం వాళ్ల చిత్రాలు బతికున్నాయంటే అది ఎన్టీఆర్ నటించిన చిత్రాల వల్లేనని అన్నారు. టీడీపీ పార్టీ స్థాపించి.. అనతికాలంలోనే అధికారం చేపట్టి తెలుగువాడు ఎక్కడున్నా సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత నందమూరి తారక రామారావు అని అన్నారు.

పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఎస్సీ రీజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. పేదలకోసం ఎన్టీఆర్ పాలనలో పేదలకోసం ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారన్నారు. ఎన్టీఆర్ తన సినిమాల్లో భక్తి రసాన్ని బతికించారు. మన సంస్కృతి సంప్రదాయాలను తన సినిమాల్లో ప్రతిబింబించారు. ఆయన పౌరాణికాల్లో నటిస్తే ప్రాణం పోసుకున్నాయి, జానపదాల్లో నటిస్తే జావళీలు పాడాయి. సాంఘిక చిత్రాలేమో సామజవరగమనాలయ్యాయి, పద్యం పదునెక్కింది, పాట రక్తి కట్టింది. కళామతల్లి కళకళలాడింది, కనుల పండువలా నవ్వింది. ఎన్టీఆర్ నటించని పాత్ర లేదు, ఆయన చేయని సినిమా లేదు. ప్రతి పాత్రను అణువణువు నింపుకుని నటించారు.

ప్రతి బిడ్డకు, మట్టి గడ్డకు కూడా నేను తెలుగువాడ్ని అని సగర్వంగా చెప్పుకునే ఆత్మవిశ్వాసాన్ని, దమ్ము ధైర్యం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో ఎన్టీఆర్ కు ముందు, ఎన్టీఆర్ కు తర్వాత అని చెప్పుకోవాలి. ఎన్నో పథకాలను సాహసోపేతమైన రీతిలో ప్రవేశపెట్టారు. పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే… పేదల భవితకు భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే… మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన అన్న ఆయనే” అని బాలయ్య వివరించారు. గురుకుల విద్యా బోధన, సంక్షేమ హాస్టళ్లు తీసుకువచ్చారని ఆనాటి విషయాలను పార్టీ శ్రేణులు, అభిమానులతో అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైస్సార్సీపీ ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు మరణం లేదని, నిత్యం వెలిగే మహోన్నత దీపం అని పేర్కొన్నారు.