నా భర్త చాలా మంచివాడు..దుబే భార్య
మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను
జైపూర్: గ్యాంగ్స్టర్ వికాస్ దూబే పోలీసులు ఎన్కౌంట్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య రిచా దుబే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త చాలా మంచివాడని చెప్పుకొచ్చింది. పోలీసులు ఆయనను వాడుకుని, ఆ తర్వాత నాశనం చేశారని వాపోయింది. భార్యాపిల్లలను దూబే అమితంగా ప్రేమిస్తాడని చెప్పింది. తమకు ఖర్చుల కోసం ప్రతి నెల రూ. 40 వేలు పంపించేవాడని వివరించింది. తమ పెద్ద కొడుకు రష్యాలో మెడిసిన్ చదువుతున్నాడని, చిన్న కుమారుడు 12వ తరగతిలో 90 శాతం మార్కులతో పాస్ అయ్యాడని చెప్పింది. తల్లిదండ్రులను కూడా దూబే గౌరవించేవాడని తెలిపింది.
ఈ నెల 3న తెల్లవారు జామున 2 గంటల సమయంలో తనకు దూబే నుంచి ఫోన్ వచ్చిందని, లక్నోలోని ఇంటికి వెళ్లిపోవాలని చెప్పాడని తెలిపింది. దీంతో తాను వెంటనే తన స్నేహితుల సాయంతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లానని చెప్పింది. కాగా తనకు రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని చెప్పింది. తన భర్త నేరస్థుడై ఉండొచ్చని, అయినప్పటికీ ఆయనో మంచి భర్త, తండ్రి అని వ్యాఖ్యానించింది. కాన్పూర్లో పోలీసులపై కాల్పుల ఘటన అనంతరం దూబే తనకు ఫోన్ చేశాడని, ఆయనతో అదే తాను చివరిసారి మాట్లాడడమని చెప్పింది. ఎన్కౌంటర్ ఘటనపై ఇప్పటికే కమిటీ నియమించిన నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/