పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం
ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రజలకు ట్రంప్ సూచన
వాషింగ్టన్: కరోనా పరిస్థితులపై మంగళవారం వైట్హౌస్లో నిర్వహించిన కాన్ఫరెన్స్లో ట్రంప్ మాట్లాడుతూ.. మానవాళికి మంచి ఫలితాలను అందించే ఏ దేశంతోనైనా పని చేసేందుకు తాము సిద్ధమనేని చెప్పారు. తమ దేశంలో కరోనాకు వ్యాక్సిన్తో ఔషధాల తయారీతో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారని ట్రంప్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ ఊహించిన సమయం కన్నా ముందుగానే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా సైన్యం వ్యాక్సిన్ పంపిణీలో సహకరిస్తుందని చెప్పారు.
కాగా, కరోనా విజృంభణ ఆగట్లేదని, అమెరికాలో పరిస్థితులు మరింత క్షీణించే అవకాశముందని ట్రంప్ తమ దేశ ప్రజలకు తెలిపారు. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్ కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని చెప్పారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. కరోనా నియంత్రణే కాకుండా, ఆ వైరస్ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యమని చెప్పారు.
కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా దురదృష్టవశాత్తూ కొన్ని చోట్ల పరిస్థితులు చేజారిపోయాయని ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. యువతలో చాలా మందికి కరోనా వచ్చినా లక్షణాలు బయపడటం లేదని, అనారోగ్యం బారినపడ్డట్లు కూడా వారికి తెలియడంలేదని, కాబట్టి యువత బాధ్యతగా మెలగాలని ట్రంప్ సూచించారు. కరోనాతో మరణించే చిన్నారుల సంఖ్య తక్కువగానే ఉంటుండటం కొంత ఊరట కలిగించే విషయమని పేర్కొన్నారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/