ఇండస్ట్రీ లో మరో విషాదం : మణిశర్మకు మాతృవియోగం
చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఉదయం రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త నుండి ఇంకా బయటపడక ముందే మరో విషాదం చిత్రసీమలో చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి (88) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. సరస్వతి కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆమె తుదిశ్వాస విడిచారు.
మణిశర్మ తండ్రి వైఎన్ శర్మ నాలుగేళ్ల కిందటే మరణించారు. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో మణిశర్మ శోకసంద్రంలో మునిగిపోయారు. మణిశర్మ బాల్యం నుంచే సంగీతం బాటపట్టడానికి తల్లి సరస్వతి ప్రోత్సాహం ఎంతో ఉంది. కాగా, తల్లిని కోల్పోయిన మణిశర్మకు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇక కృష్ణం రాజు అంత్యక్రియలు రేపు మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో జరపబోతున్నారు. కడసారి కృష్ణం రాజు ను చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు , అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు.