ములాయం సింగ్ యాదవ్కు సతీవియోగం

లక్నోః ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధనా గుప్తా.. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. కొద్దిరోజులుగా గుప్తా.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గుప్తాకు వేరే వ్యక్తితో 1987లో తొలి వివాహం జరిగింది. నాలుగేళ్లకే విడాకులు పొందిన ఆమెకు ములాయం సింగ్ యాదవ్తో పరిచయం ఏర్పడింది. 2003లో ములాయం సింగ్ మొదటి భార్య మాలతీ దేవి చనిపోయిన అనంతరం.. సాధనా గుప్తాతో వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు ములాయం.
మరోవైపు ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సంతాపం తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా మృతి చెందారనే బాధాకరమైన వార్త తెలిసింది. భగవంతుడి పాదాల చెంత ఆమె పవిత్ర ఆత్మకు చోటు కల్పించాలని ప్రార్థిస్తున్నాను. ములాయం సింగ్, ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/