కుటుంబ సభ్యులను హింసించి డబ్బులు వసూలు చేశారుః ఎంపీ ఎంవీవీ

మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారుః ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

MP MVV Satyanarayana Press Meet about Kidnapping Case

విశాఖః తమ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినట్లుగా పోలీసులు చెప్పే వరకు తమకు తెలియదని వైఎస్‌ఆర్‌సిపి నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఈ నెల 12న తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని చెప్పారు. కిడ్నాపర్లు తమ కుటుంబ సభ్యులను హింసించి డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారని, ఈ ఘటనకు సంబంధించి హేమంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారని వెల్లడించారు. ఏ2 రాజేశ్‌పై 40కి పైగా కేసులు ఉన్నట్లు తెలిసిందన్నారు. హేమంత్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విశాఖలో రక్షణ లేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని, అది ఏమాత్రం సరికాదన్నారు. కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారని గుర్తు చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరగడం ఎక్కడైనా సహజమే అన్నారు.