హైదరాబాద్ కు తిరిగొస్తున్న ఎంపీ అవినాశ్ రెడ్డి

mp-avinash-reddy-return-to-hyderabad-along-with-his-ailing-mother

హైదరాబాద్‌ః వివేకా హత్య కేసులో వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన హైదరాబాదులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తల్లికి అనారోగ్యంగా ఉందంటూ పులివెందుల పయనమయ్యారు. అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తున్నారు.

ఈ అంబులెన్స్ తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఎంపీ అవినాశ్ రెడ్డి కాన్వాయ్ కి ఎదురైంది. దాంతో, ఆయన తన కాన్వాయ్ ని ఆపి, అంబులెన్స్ లో ఉన్న తల్లిని పరామర్శించారు. అనంతరం తన కాన్వాయ్ ని మళ్లీ వెనక్కి మళ్లించారు. ప్రస్తుతం అంబులెన్స్ సహా ఎంపీ అవినాశ్ రెడ్డి భారీ కాన్వాయ్ హైదరాబాద్ వస్తోంది. కాగా, ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లిని తరలిస్తున్న అంబులెన్స్ లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సుధీర్ రెడ్డి అనుచరులు ఎంపీ అవినాశ్ రెడ్డి కాన్వాయ్ ను అనుసరించి పలు వాహనాల్లో వస్తున్నట్టు సమాచారం.