వివేక్ హత్య కేసు : ముగిసిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మంగళవారం ముగిసింది. సుమారు నాలుగున్నర గంటల పాటు న్యాయవాది సమక్షంలో అవినాష్‌రెడ్డిని అధికారులు విచారించారు. జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌ను విచారించిన సీబీఐ.. ఈరోజు కూడా ప్రశ్నించింది. వివేకా హత్య కేసుకు సంబంధించిన పలు అంశాలపై సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు వైఎస్ అవినాష్‌రెడ్డి.

పార్లమెంటు సమావేశాలు ఉన్నందున సీబీఐ ముందు హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ సోమవారం సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే, తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ ఎదుట హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీ కోరారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సీబీఐ వద్దే తేల్చుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో మంగళవారం వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.