కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. జాగ్రత్త..జాగ్రత్త అని పదే పదే చెపుతున్న కొంతమంది మాత్రం ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మితిమీరిన డ్రైవింగ్ , మద్యం మత్తు , నిద్ర మత్తులో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై లారీ బోల్తా పడడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులంత ఓకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన బోర్నపల్లి దగ్గర జరిగింది.

సైదాపూర్‌ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్‌కు మట్టితో ట్రక్కు వస్తుంది. ఈ సమయంలో బోర్నపల్లి మూలమలుపు దగ్గర డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో ట్రక్కు అదుపుతప్పింది. ఆ సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువతీయువకులపై మట్టి పడింది. దీంతో వెంటనే బాధితులను హుజూరాబాద్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విజయ్‌, సింధుజ ఇద్దరు మృతిచెందగా.. వర్ష అనే యువతి చికిత్స పొందుతూ చనిపోయిందని వైద్యులు తెలిపారు. వీరు బోనాల జాతర కు వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.