త్వరలో మౌలాలి – హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఫిబ్రవరి లోపే అందుబాటులోకి

moulali-hitech-city-mmts-likely-to-be-available-from-february

హైదరాబాద్‌ః త్వరలో మౌలాలి-హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైలు పట్టాలెక్కనుంది. ఫిబ్రవరిలోపే ఈ రైళ్లు నడిచే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో భాగంగా చేపట్టిన మౌలాలి-సనత్‌నగర్‌ మధ్య నిర్మిస్తున్న రెండో లైను పనులు పూర్తయ్యాయి. దీంతో, మౌలాలి నుంచి నేరుగా హైటెక్ సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు అవకాశం లభించింది.

మౌలాలి-సనత్‌నగర్ మధ్య మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో మరో ఆరు స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో, ఆయా ప్రాంతాల వారు కేవలం 30 నిమిషాల్లోనే ఐటీ సంస్థలు ఉండే ప్రాంతాలకు చేరుకునే అకాశం ఉంటుంది.

మాల్కాజిగిరి నియోజకవర్గంలో 25 వేల నుంచి 30 వేల మంది వరకూ ఐటీ ఉద్యోగులు ఉంటారని కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతం అక్కడి వారు ఐటీ కారిడార్‌కు రావాలంటే నేరేడ్‌మెట్, ఆర్‌కేపుర వంతెన, కంటోన్మెంట్, బేగంపేట మీదుగా సొంత వాహనాల్లో ప్రయాణిస్తు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇక సనత్‌నగర్‌, పీర్జాదీగూడ, సుచిత్ర సెంటర్, భూదేవినగర్, అమ్ముగూడ, నేరేడ్‌మెట్, హౌసింగ్‌బోర్డు కాలనీ స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుండటంతో ఆయా ప్రాంతాల వారి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.