కరీంనగర్ లో దారుణం : ఇంట్లో నిద్రిస్తున్న మహిళలపై దుండగుల దాడి
కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని రామకృష్ణకాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై దుండగులు కత్తితో దాడిచేశారు. దీంతో కూతురు మరణించగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రామకృష్ణ కాలనీలో బాలవ్వ, సులోచన అనే తల్లీకూతుళ్లపై గురువారం అర్ధరాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సులోచన అక్కడికక్కడే మృతిచెందగా.. రక్తపు మడుగుల్లో పడి ఉన్న బాలవ్వను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాలే ఈ దాడికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.