మార్చి 1న వైజాగ్ లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోడీ మార్చి 1న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. మొదట ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో బహిరంగ సభలోప్రసంగిస్తారు. అనంతరం రూ.26,264 కోట్లతో HPCL విస్తరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. సబ్బవరంలో నిర్మిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం యూనివర్సిటీ, ఓఎన్జసీ ప్రాజెక్టుతో కలిపి మొత్తం 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ ల్యాబ్‌ను ప్రధాని మోదీ ఈ నెల 26న ‘వర్చువల్‌’గా ప్రారంభిస్తారు. గతంలో దీనికి ఉన్న ప్రాంతీయ ఫుడ్‌ ల్యాబొరేటరీ హోదాను కేంద్రం రూ.4.5 కోట్లతో రాష్ట్ర స్థాయికి పెంచింది. అత్యాధునిక పరికరాల కోసం రూ.14 కోట్లను కేటాయించి.. ఇప్పటికే రూ.8 కోట్లను మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో పరికరాలు, యంత్రాలు సమకూరితే ఏడాదికి సుమారు 20 వేల ఆహారం, నీటి నమూనాలను పరీక్షించేందుకు వీలు ఏర్పడుతుంది. దీంతో పాటు ప్రభుత్వానికి అదనంగా ఆదాయమూ సమకూరుతుంది.

మరోవైపు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో, తిరుపతిలోని టీటీడీ భవనంలోనూ రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.18 కోట్ల చొప్పున విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.07 కోట్లతో తీసుకువచ్చిన నాలుగు ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ ల్యాబ్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.