ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి – సీఎం రేవంత్

మే 27 న జరగబోయే ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ పరిధిలోని అన్ని బూత్లను ఎమ్మెల్యేలు సందర్శించాలని, కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. బుధువారం రాత్రి సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జిలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

మూడు ఉమ్మడి జిల్లాల నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 27న పోలింగ్ ఉన్నందున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులను సన్నద్ధం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని, తీన్మార్ మల్లన్నఎన్నిక, కాంగ్రెస్ పార్టీ ఎన్నికగా పని చేసి గెలుపునకు పని చేయాలన్నారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు సూచించారు.

కాగా 2021లో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ బై ఎలక్షన్‌ అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచారానికి మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.