వైస్సార్సీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారు – ఉండవల్లి శ్రీదేవి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైస్సార్సీపీ పార్టీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేల ఫై వేటు వేసిన సంగతి తెలిసిందే. వారిలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఒకరు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున సొంత నేతలు ప్రచారం చేయడం తో పాటు పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి శ్రీదేవి వైస్సార్సీపీ నేతల ఫై సంచలన వ్యాఖ్యలు చేసింది.

వైస్సార్సీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి హాట్‌ కామెంట్స్ చేశారు. గత మూడు రోజులు గా వైస్సార్సీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారని , నేను అజ్ఞాతం లో ఉన్నానని అంటున్నారని.. మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళానని తెలిపింది. వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు. నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా అని నిలదీశారు. లేదా సీసీ కెమెరా పెట్టారా అని ప్రశ్నించారు. నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు.. నన్ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు.

దోచుకో, దాచుకో, పంచుకో అని జగన్ చెబుతున్నారని, తాను అలా చేయబోనని తెలిసి పార్టీ నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఇసుక దందాలు, దోపిడీలకు పాల్పడ్డారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాపై దొంగ అనే ముద్ర వేశారని, డబ్బులు తీసుకుని పారిపోయానని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భర్త ప్రముఖ వైద్యులమని, తమకు రెండు ఆస్పత్రులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మహిళను అని చూడకుండా ఇష్టారీతిగా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చేసిన తప్పేంటో చెప్పకుండా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు.

అమరావతి పోరాటంలో ఇప్పటి నుంచి రాజధాని రైతుల పోరాటంలో తాను భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అమరావతిలోని ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు.. రాజధాని గురించి తనను అందరూ అడిగితే జగనన్న తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నారని వారికి చెప్పానని అన్నారు. కానీ, గెలిచిన తర్వాత మూడు రాజధానుల తెరపైకి తీసుకొచ్చారని, అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే ఆ ప్రాంత ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేకపోయాయని పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన అభివృద్ధిలో 10 శాతం కూడా రాష్ట్రంలో జరగలేదని, జగనన్న ఇళ్ల పథకం అనేది ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు.