కృష్ణ మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి రోజా
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ నటి , వైస్సార్సీపీ మంత్రి రోజా విచారం వ్యక్తం చేసారు. కృష్ణ మరణించారనే వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు.. ఇప్పుడు కృష్ణ కూడా మరణించడం తెలుగు సినీ రంగానికి తీరని లోటని అన్నారు. మహేష్ బాబుకు దేవుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడో అని వ్యాఖ్యానించారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మంత్రి రోజా ఆకాంక్షించారు.
అలాగే మంత్రి అంబటి రాంబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాతగా , సూపర్ స్టార్ గా వెలుగొందిన తెలుగు చలన చిత్ర ధృవతార రాలిపోయింది! అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అలాగే సీఎం జగన్ సైతం ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేసారు.
‘‘కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి… ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ తెలిపారు. ఘట్టమనేని కుటుంబంతో వైయస్ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది అంటూ జగన్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ లో కృష్ణ భౌతిక దేహానికి సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చి నివాళ్లు అర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ , వెంకయ్య నాయుడు , చంద్రబాబు నాయుడు , కేటీఆర్ , చిరంజీవి , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , చరణ్, వెంకటేష్ , మోహన్ బాబు , శరత్ కుమార్ ఇలా ఎంతో మంది వచ్చి నివాళ్లు అర్పించారు.