ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు : పేర్నినాని

అమరావతి: ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు వస్తారని మంత్రి పేర్నినాని అన్నారు. బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ, తెలంగాణ బస్‌ ఆపరేటర్ల అసోసియేషన్ల ఆధ్వర్యంలో ‘వన్‌ ఇండియా, వన్‌ బస్‌’ వెబ్‌సైట్‌ను మంత్రి సోమవారం రాత్రి విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు మంత్రి పదవి ఇచ్చాక రవాణాశాఖ కేటాయించినపుడు.. ఇందులో అధికారులు ఎవరెవరు ఉన్నారని చూశాను. ఎవరి మాట వినని ముగ్గురు అధికారులను అప్పగించినందుకు సీఎం జగన్‌ను తిట్టుకున్నానన్నారు.

రవాణా మంత్రిగా ఎవరు వచ్చినా తన అభిప్రాయాలు వారికి చెప్పడమే కాకుండా.. రవాణా వ్యవస్థలో సమస్యలు పరిష్కరించడానికి వ్యక్తిగతంగా కృషిచేస్తానన్నారు మంత్రి పేర్ని నాని. అసోసియేషన్‌తో ఇదే చివరి మీటింగ్ అనీ.. రవాణా శాఖ అధికారులంతా బాగా సహకరించారని చెప్పుకొచ్చారు. వన్ ఇండియా వన్ బస్ వెబ్‌సైట్ ఆవిష్కరణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని.‘ఈనెల 11 నుంచి కొత్త మంత్రులు రానున్నారు. ఎవరు రవాణా మంత్రిగా వచ్చినా.. నా అభిప్రాయాలను పంచుకుంటానన్నారు. మూడేళ్ల పాటు లారీలు, బస్సు యజమానుల సంఘాలతో కలిసి పనిచేసినవాడిగా మీ సమస్యలను కొత్త రవాణా మంత్రి వద్దకు, అవసరమైతే సీఎం వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. తెలంగాణలో మా బస్సులకు మీరు కేసులు రాస్తే, మేమూ ఇక్కడ రాస్తామని మంత్రి నాని హెచ్చరించారు. లారీలకు సంబంధించి అంతర్‌ రాష్ట్ర ఒప్పందం కోసం తెలంగాణ అధికారులతో ప్రయత్నం చేశామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/