న్యాయవాదుల హత్యపై స్పందించిన కేటీఆర్

హైదరాబాద్ : మంత్రి కేటిర్ న్యాయవాదులు వామనరావు దంపతుల దారుణ హత్యపై స్పందించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ న్యాయవాద విభాగం సమావేశంలో మంత్రి మాట్లాడారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం కోసం కృషి చేస్తామని అన్నారు. న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక నేతను పార్టీ నుంచి తొలగించినట్టు చెప్పారు. హంతకులను వదిలిపెట్టబోమని, కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్యకేసును కొందరు రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు లాఠీ దెబ్బలు తిన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ. 100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, నల్ల చట్టాలను తెచ్చిందని ఆరోపించారు.

జీడీపీని పెంచుతామని పెట్రో, గ్యాస్ ధరలను కేంద్రం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై గతంలో కాంగ్రెస్‌ను తిట్టిన మోదీ ఇప్పుడు దేశ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానిస్తే, తాము మాత్రం ఆయనను ఎంతగానో గౌరవిస్తున్నామని, ఆయన కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చామని, న్యాయవాదులంతా ఆమెకు అండగా నిలవాలని కేటీఆర్ కోరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/national/