కర్నూల్ జిల్లాలో పెనుప్రమాదం తప్పింది

కర్నూల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి కర్నూల్ వెళ్తున్న బస్సు డోన్ పట్టణంలోని ఫ్లైఓవర్‌పై అదుపుతప్పింది. ఫ్లైఓవర్​పై కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొట్టింది. ముందు టైర్ గాల్లో వేలాడుతూ అక్కడే ఆగిపోయింది. కొద్దిగా ముందుకు దూసుకెళ్లి ఉంటే పెనుప్రమాదం జరిగేది.

ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బ్రిడ్జిపైనే ఆగిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు ఢీకొనడంతో రెయిలింగ్ పగిలిపోయి కింద బైక్‌పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు వంశీ, నూర్​భాషా, వరునాధిత్యలపై పడ్డాయి. దీంతో వారికీ గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్​కు తరలించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.