ఇదేనా మీరు జాతికి తెలియజెప్పే స్వదేశీ నినాదం ? :మంత్రి కేటీఆర్
చేనేతపై జీఎస్టీ విధించిన తొలి ప్రధానిగా మోడీకి గుర్తింపు దక్కిందని ఎద్దేవా
హైదరాబాద్ః మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పంచారు. జాతి పిత మహాత్మాగాంధీని గుర్తు చేస్తూ ఆయన మోడీపై సెటైర్లు వేశారు. స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి నాడు మహాత్మా గాంధీ ఆత్మ నిర్భర్ చిహ్నంగా చరఖాను ఉపయోగిస్తే… నేడు చేనేత, ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోడీకి ఓ గుర్తింపు దక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇదేనా మీరు సాధించిన ఆత్మ నిర్భర్ భారత్ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జాతికి తెలియజెప్పే స్వదేశీ నినాదం ఇదేనా అని కూడా ఆయన విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఓ ట్వీట్ను పోస్ట్ చేశారు.
కాగా, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరిట భారీ కార్యక్రమాలకు తెర తీసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నిత్యావసరాలు సహా పలు ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తూ కేంద్రం సాగుతున్న తీరూ తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/