సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
రైతన్న కళ్లలో మురిపెం కనపడుతోంది..కెటిఆర్
హైదరాబాద్: పంటల సాగులో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలవడంపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ సీజన్లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని దిన పత్రికల్లో వచ్చిన వార్తలను తెలంగాణ మంత్రి కెటిఆర్ పోస్ట్ చేశారు. సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదికలో వచ్చిన వివరాలు అందులో ఉన్నాయి. ఈ సీజన్లో 126.179 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపినట్లు అందులో పేర్కొన్నారు. ‘ఒకనాడు సాగునీరు లేక నెర్రెలు బారిన ఈ నేల నేడు రైతుబంధు కెసిఆర్ గారి నేతృత్వంలో నదీ జలాలు పారగా వ్యవసాయంలో నూతన రికార్డులు సృష్టిస్తోంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటే, రైతన్న కళ్లలో మురిపెం కనపడుతోంది’ అని కెటిఆర్ ఈ సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/