ఎంఎం కీరవాణి, చంద్రబోస్‏లను సత్కరించిన గవర్నర్‌ తమిళిసై

Governor Tamilisai honored MM Keeravani and Chandra Bose

హైదరాబాద్‌ః తెలంగాణ రాజ్ భవన్‍లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గవర్నర్ తమిళి సై సత్కరించారు. ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయ రచయిత చంద్రబోస్‏లను సత్కరించారు. వీరిని శాలువతో సన్మానించి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. అలాగే.. ఎన్జీవో భగవాన్ మహవీర్ వికలాంగ సహాయతా సమితి, పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ, సివిల్స్ శిక్షకురాలు బాలలతలను గవర్నర్ సన్మానించారు.

కాగా, బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో ఎంఎం కీరవాణికి పద్మ శ్రీ అవార్డ్ వరించింది. భారతదేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ శ్రీని కీరవాణి అందుకోనున్నారు. మరోవైపు ఆయన మ్యూజిక్ అందించిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సొంతం చేసుకున్నారు. మార్చిలో ఆస్కార్ అవార్డు వేడుకలు జరగనున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఊర్రుతలుగిస్తోన్న నాటు నాటు పాటను చంద్రబోస్ రాయగా.. కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటకు ప్రేమ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/