కేంద్రం తన సంపదను మిత్రులకు పంచిపెడుతోందిః మంత్రి హరీశ్ రావు
బిజెపి వైఖరిపై ఘాటు విమర్శలు గుప్పించిన హరీశ్ రావు
హైదరాబాద్ః నేడు అసెంబ్లీలో మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ… టిఆర్ఎస్, బిజెపిల విధానాలను ప్రస్తావించారు. విఫలం.. విషం.. విద్వేషం.. విధానాన్ని బిజెపి అవలంబిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. అదే సమయంలో సఫలం.. సంక్షేమం.. సామరస్యం.. విధానాన్ని టిఆర్ఎస్ పాటిస్తోందని ఆయన తెలిపారు. గడచిన 8 ఏళ్ల కాలంలో ఈ రెండు పార్టీలు అవలంబించిన విధానాలు ఇవేనని ఆయన చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్రం… బలహీన రాష్ట్రం, బలమైన కేంద్రం అన్న విధానంతో ముందుకు సాగుతోందన్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాల మీదే రాష్ట్రాలు ఆధారపడాలన్న ఆలోచనతో కేంద్రం సాగుతోందని ఆయన విమర్శించారు. కేంద్రం తమ సంపదను తన మిత్రులకు పంచి పెడుతోందన్న హరీశ్ రావు… తెలంగాణ మాత్రం పేదలకు పంపిణీ చేస్తోందని ఆయన తెలిపారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్షా 5 వేల కోట్ల బకాయిలు రావాల్సివుందని చెప్పారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం అప్పుల్లో పంజాబ్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. కేంద్రం అప్పు కోటీ 52లక్షల 17వేల కోట్లుగా ఉందని..అంటే ప్రతి పౌరుడిపై లక్షా 25వేల అప్పు ఉన్నట్లు హరీష్ రావు చెప్పారు. తెలంగాణ అప్పు 3లక్షల 29వేల కోట్లు అన్న మంత్రి..రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై 94వేల రూపాయల అప్పు ఉందన్నారు. రాష్ట్రం ఆదాయం రెట్టింపు అయ్యిందని తెలిపారు. కాళేశ్వరానికి ఇంకా లక్ష కోట్లు అవసరమయ్యేదన్న మంత్రి.. ఈ ప్రాజెక్ట్ దర్వినియోగం కాలేదని సద్వినియోగం అయ్యిందని వెల్లడించారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/