ఏపీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు మంత్రి గంగుల హెచ్చరిక

ఏపీనేతలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్. పవన్ కళ్యాణ్, కె ఏ పాల్, వైయస్ షర్మిల కు తెలంగాణలో ఏం పని అని అన్నారు. రాష్ట్ర సంపదపై కన్నేసి కొందరు వస్తున్నారని.. ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వనరులను దోచుకునేందుకు మళ్లీ వస్తున్న పార్టీలు, నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలే నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఇక్కడి సంపదను, వనరులను దోచుకెళ్లడానికి వస్తున్నారని దుయ్యబట్టారు. తిరుగుబాటు మొదలెట్టకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. చంద్రబాబు, షర్మిల, కేఏ పాల్, పవన్ కళ్యాణ్ వీళ్లంతా బిజెపి వదిలిన బాణాలేనన్నారు. తాజాగా చంద్రబాబు ఖమ్మంలో సభ నిర్వహించడంతో పాటుగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యస్పదంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బలవంతంగా కలిపేందుకు కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్‌చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఆంధ్ర నుంచి వేర్వేరూ వేశాల్లో వస్తున్న నాయకులు ఒకే గొడుగుకు చెందిన వారని విమర్శించారు. వీరి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.