నింగిలోకి బుల్లి రాకెట్‌ ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2

ఇస్రో మరో ఘనత సాధించింది. నింగిలోకి బుల్లి రాకెట్‌ ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 పంపించి సక్సెస్ సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 ప్రయోగం విజయవంతమైంది. ఈరోజు తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమవగా… ఉదయం 9.18గంటకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2(స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌-డీ2) నింగిలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రయోగం 15 నిమిషాల్లోపే పూర్తయింది. ఇస్రోకు చెందిన 156.3కిలోల బరువు కలిగిన ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు అమెరికా అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ విజయంతో భారత్‌ కొత్త రికార్డు నెలకొల్పింది. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిన దేశంగా భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. వాస్తవానికి ఆగస్టు 7న ఇస్రో ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్వీ (SSLV) తొలి రాకెట్‌ చివరి నిమిషంలో ఉపగ్రహాల నుంచి సంకేతాలు అందకపోవడంతో విఫలమైన విషయం తెలిసిందే.