రుతుస్రావం వైకల్యం కాదు: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
మహిళలకు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ను వ్యతిరేకించిన స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: మహిళల్లో జరిగే రుతుస్రావం వైకల్యం కాదు అని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. నెలసరి అయ్యే మహిళలకు పెయిడ్ లీవ్ ఇవ్వాలని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ జా రాజ్యసభలో వేసిన ప్రశ్నకు ఆమె బదులు ఇచ్చారు. పెయిడ్ లీవ్ను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. మహిళలకు రుతుస్రావం కావడం సమస్య కాదు అని, నెలసరి, రుతుక్రమం వైకల్యమే కాదు అన్నారు. ఇది మహిళల జీవితాల్లో సహజమైన ప్రక్రియ అని మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.
మహిళా ఉద్యోగులకు ఇచ్చే లీవ్ల అంశంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఆర్జేడీ నేత జా ప్రశ్న వేశారు. రుతుస్రావం వంకతో సమాన అవకాశాల్ని దూరం చేయడం కరెక్టు కాదు అని ఆమె అన్నారు. నెలసరి అయ్యే మహిళల ఆరోగ్యం విషయంపై తమ ప్రభుత్వం ఓ ముసాయిదాను తయారు చేసిందని మంత్రి తెలిపారు. 10 నుంచి 19 ఏళ్ల మధ్య అమ్మాయిల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్ను అమలు చేస్తోందన్నారు.