రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్న కెసిఆర్
ఆసుపత్రి నుంచి నందినగర్ లోని ఇంటికి వెళ్లనున్న కెసిఆర్
హైదరాబాద్ః సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రేపు డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. రేపు డిశ్చార్జ్ చేస్తున్నామని వెల్లడించారు.
తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. ఆసుపత్రిలో కెసిఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, చిన్న జీయర్ స్వామి, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత 6 రోజులుగా కెసిఆర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.